gramavolunteer.com

మహిళా వాలంటీర్లు మరియు మహిళా పోలీసులకు పదోన్నతులు.

మహిళా వాలంటీర్లు మరియు మహిళా పోలీసులకు పదోన్నతులు.

మహిళలు, బాలల సంరక్షణలో కీలకమైన సచివాలయ మహిళా పోలీసులకు ఇన్స్పెక్టర్ (నాన్ గెజిటెడ్) వరకు పదోన్నతులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ సిలబస్; జాబ్ చార్ట్, సబార్డినేట్ సర్వీస్ నిబంధనలను ఖరారు చేసింది. ఈమేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గుడి విజయకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా పోలీసు, సీనియర్ మహిళా పోలీసు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ), సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ), ఇన్స్పెక్టర్ (నాన్ గెజిటెడ్).. ఇలా ఐదు కేటగిరీలుగా వీరిని పరిగణిస్తారు. మొదటి స్థాయిలో ప్రత్యక్ష ఎంపిక ద్వారా మహిళా పోలీస్ లను నియమిస్తారు. అనంతరం సీనియర్ మహిళా పోలీస్, ఏఎస్ఐ, ఎస్ఐ, ఇన్స్పెక్టర్ వరకు పదోన్నతులు ఇస్తారు.

ఎంపిక చేయు విధానం

ఇకపై రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మహిళా పోలీసుల నియామకం ఉంటుంది.

90 శాతం మందిని నేరుగా ఎంపిక చేస్తారు. మిగిలిన 10 శాతంలో 5 శాతం అర్హులైన హోమ్ గార్డులకు, మిగిలిన 5 శాతం గ్రామ / వార్డు సచివాలయాల వలంటీర్లకు కేటాయించారు.

5 అడుగులు ఎత్తు, 40 కిలోల తగ్గకుండా బరువు ఉన్న అభ్యర్థులు అర్హులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజనులకు ఎత్తు 148 సెంటీమీటర్లు, బరువు 38 కిలోలు ఉండాలి.

దేహ దారుఢ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)లో 20 నిమి షాల్లో 2 కిలోమీటర్లు నడవాలి. దీంతోపాటు రాత, మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించాలి.

రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.

కానిస్టేబుల్ నుంచి సీఐ/ ఇన్స్పెక్టర్ వరకు పోలీస్ శాఖలో ఉన్న రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిర్ణయాధికారాలు వీరికీ వర్తిస్తాయి.

శాంతిభద్రతలు, మహిళలు, పిల్లల రక్షణ, ప్రజా సేవలు సహా పలు అంశాలపై ఇన్ డోర్, 10 విభాగాల్లో అవుట్ డోర్ శిక్షణ ఉంటుంది.

మహిళా పోలీస్ గా కనీసం ఆరు సంవత్సరాలు, సీనియర్ మహిళా పోలీస్ గా ఐదేళ్లు, ఏఎస్ఐగా ఐదేళ్లు, ఎస్ఐగా ఐదేళ్లు పనిచేసిన వాళ్లు ఆపై పదోన్నతులకు అర్హులు. సంబంధిత పోస్టులో పనితీరు, రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకుని పదోన్నతి ఇస్తారు.

బోర్డు పరీక్షలకు 90%, పనితీరుకు 10 శాతం వెయిటేజీ ఇస్తారు.

జాబ్ చార్ట్

  • శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను ఎప్పటికప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలి.
  • తమ పరిధిలోని విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులకు రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించాలి.
  • అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలి.
  • ఆత్మహత్యలు, ఒత్తిడి అధిగమించడంపై రైతులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి.
  •  అవసరం మేరకు పోలీస్ స్టేషన్లలో కేసుల విచారణకు సహాయపడాలి.
  •  ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలి.
  •  బాల్య వివాహాల కట్టడికి ఐసీడీఎస్, రెవెన్యూ, ఇతర శాఖలతో కలిసి పనిచేయాలి.
  •  గృహ హింస, బాల్య వివాహం, లైంగిక వేధింపుల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via